వరంగల్, వెలుగు: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో సీనియర్ శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా హరీశ్రావు అబద్దాలు మాట్లాడొద్దని, అది సిగ్గుచేటని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హరీశ్రావు ధర్నా పేరుతో వరంగల్ వచ్చి తప్పుడు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర విభజన హామీలో చేర్చిందన్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా రూ.20 కోట్లు మంజూరు చేసి ప్రథమంగా 54 ఎకరాల భూములను అప్పగించినట్లు తెలిపారు. కాజీపేట అభివృద్ధి విషయంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, దీనికిముందు ఆయన సోదరుడు ప్రణయ్ భాస్కర్ హామీలు ఇచ్చుడు తప్పితే పనులు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము కాజీపేట బస్టాండ్ నిర్మాణం కోసం స్థలం తీసుకొచ్చినట్లు చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కార్మికులు, భూనిర్వాసితులతో కలిసి తాము కొట్లాడితే, మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నమ్మి హరీశ్రావు అబద్దాలు మాట్లాడి వెళ్లాడన్నారు.
